తెలంగాణ నుంచి సోనియాగాంధీ పోటీ చేయాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy three resolutions in TPCC meeting
  • దీపాదాస్‌ మున్షీకి అభినందనలు తెలుపుతూ తొలి తీర్మానం
  • తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు సమన్వయంతో పనిచేసిన ఠాక్రేను అభినందిస్తూ రెండో తీర్మానం 
  • లోక్ సభ ఎన్నికల్లో 17 సీట్లలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపు   
లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీని పోటీ చేయించాలని టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ ఇంఛార్జ్ దీపదాస్ మున్షీ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి మూడు తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జ్‌గా దీపాదాస్‌ మున్షీకి అభినందనలు తెలుపుతూ తొలి తీర్మానం, తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు సమన్వయంతో పనిచేసిన మాణిక్‌రావు ఠాక్రేను అభినందిస్తూ రెండో తీర్మానం, రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియాగాంధీని పోటీ చేయాలని కోరుతూ మూడో తీర్మానం చేశారు. 

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి.. వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యతను తీసుకుంటామన్నారు. ఈ బాధ్యత తమదే అన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో 17 సీట్లను లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నామన్నారు. 17 సీట్లలో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 12కు తగ్గకుండా లోక్ సభ స్థానాలు గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ నెల 8న 5 జిల్లాలు, 9న 5 జిల్లాల నేతలతో లోక్ సభ ఎన్నికలకు సంబంధించి సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఈ నెల 10 నుంచి 12 వరకు 17 పార్లమెంట్ ఇంఛార్జిలతో సన్నాహక సమావేశం నిర్వహిస్తామని... 20వ తేదీ తర్వాత క్షేత్ర స్థాయిలో పర్యటిస్తానన్నారు.
Go Back to Shorts
Revanth Reddy
Congress
Telangana

More Telugu News