టీడీపీతో టచ్ లో ఉన్నాననే వార్తల్లో నిజం లేదు: బాలినేని శ్రీనివాస్ రెడ్డి

  • బాలినేని వైసీపీని వీడుతున్నారంటూ ప్రచారం
  • రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్ తోనే ఉంటానన్న బాలినేని
  • విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నానని వ్యాఖ్య
ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీ వీడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈసారి ఒంగోలు నుంచి కాకుండా గిద్దలూరు నుంచి పోటీ చేయాలని జగన్ చెప్పడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారని చెపుతున్నారు. ఈ నేపథ్యంలో బాలినేని స్పందిస్తూ... తాను పార్టీ మారుతున్నాననే ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. టీడీపీ నేతలతో తాను టచ్ లో ఉన్నాననే వార్తలు నిజం కాదని అన్నారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు తాను జగన్ తోనే ఉంటానని చెప్పారు. 

వచ్చే ఎన్నికల్లో కూడా తాను వైసీపీ అభ్యర్థిగా ఒంగోలు నుంచే పోటీ చేస్తానని బాలినేని తెలిపారు. తాను విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నానని చెప్పారు. విలువల కోసమే మంత్రి పదవిని కూడా వదులుకున్నానని, జగన్ వెంట నడిచానని అన్నారు. సామాజిక సమీకరణాలలో భాగంగానే ఎమ్మెల్యేల స్థానాలను మారుస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ జగన్ కు, పార్టీకి అండగా ఉండాలని అన్నారు.  

Balineni Srinivasa Reddy
YSRCP
Telugudesam

More Telugu News