ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయంపై 'కుమారి ఆంటీ' రియాక్షన్

Hotel Kumari Aunty reaction on Revanth Reddy decision
  • ముఖ్యమంత్రి తన హోటల్‌ను తెరిపించాలని నిర్ణయించడం సంతోషకరమన్న కుమారి ఆంటీ
  • రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల తాను చాలా హ్యాపీగా ఉన్నానని వెల్లడి
  • ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి స్పందించడం గొప్ప విషయమని హర్షం 
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన హోటల్‌ను తెరిపించాలని నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరమని హైదరాబాద్, మాదాపూర్ కు చెందిన కుమారి ఆంటీ ఆనందం వ్యక్తం చేశారు. తన హోటల్ తెరుచుకునేలా డీజీపీకి సీఎం ఆదేశాలు జారీ చేసిన తర్వాత మీడియా ప్రతినిధులు కుమారి ఆంటీతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... సీఎం రేవంత్ నిర్ణయం పట్ల నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నానని... ఇది ఆయన తమకు ఇచ్చిన వరం అన్నారు. రోడ్ సైడ్ హోటళ్లకు ప్రభుత్వం ఇంత మద్దతు ఇవ్వడం సంతోషమే అన్నారు.

తాను గత పదమూడేళ్లుగా స్ట్రీట్ ఫుడ్‌ను నిర్వహిస్తున్నానని కుమారి ఆంటీ తెలిపారు. తన హోటల్ తొలగింపుకు సంబంధించి మొదట తనకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. నిన్న 50 వేల రూపాయల ఫుడ్ వృథా అయిందన్నారు. తన ఫుడ్ కోర్టు బండిని సీజ్ చేశారని... తన కొడుకును కొట్టారని వాపోయారు. ఇంత జరిగాక మళ్ళీ హోటల్ తెరుస్తామని తాము అస్సలు అనుకోలేదని... తనలాంటి చిన్న స్ట్రీట్ ఫుడ్ హోటల్ మహిళను గుర్తించి ఓ ముఖ్యమంత్రి స్పందించడం గొప్ప విషయం అన్నారు. అందుకు రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ నిర్వహిస్తోంది. సోషల్ మీడియాలో ఆమె వైరల్‌గా మారడంతో అక్కడకు పెద్ద ఎత్తున జనాలు వచ్చారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందంటూ మంగళవారం ఆమె హోటల్‌ను పోలీసులు సీజ్ చేశారు. అక్కడి నుంచి హోటల్‌ను తొలగించాలన్నారు. అయితే తన ఒక్కదానినే ఇలా ఆదేశించడం ఏమిటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతలో ముఖ్యమంత్రి ఈ అంశంపై స్పందించారు.
Go Back to Shorts
Kumari Aunty
Revanth Reddy
Congress
Hyderabad

More Telugu News