పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు కష్టాల్లో ఉంది: మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

Gutha Sukhendar Reddy on BRS
  • బీఆర్ఎస్‌లో నిర్మాణ లోపం, అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందని వ్యాఖ్య
  • ఎమ్మెల్యే కేంద్రంగా రాజకీయాలు చేయడం వల్లే బీఆర్ఎస్ కష్టాల్లో పడిందన్న గుత్తా సుఖేందర్ రెడ్డి
  • ఎమ్మెల్సీలపై అనర్హత వేటు కోరుతూ బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిందని వెల్లడి
  • రాజ్యాంగబద్ధంగా.. న్యాయబద్ధంగా నిర్ణయం తీసుకుంటానన్న గుత్తా
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు కష్టాల్లో ఉందని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. అయితే తాను పార్టీ మారుతానని జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తాను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నానని తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్‌లో నిర్మాణ లోపం, అంతర్గత ప్రజాస్వామ్యం లోపించాయన్నారు. ఎమ్మెల్యే కేంద్రంగా రాజకీయాలు చేయడం వల్లే బీఆర్ఎస్ కష్టాల్లో పడిందని అభిప్రాయపడ్డారు.

ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిందని తెలిపారు. ఆ పార్టీ చేసిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. న్యాయబద్ధంగా... రాజ్యాంగబద్ధంగా తన నిర్ణయం ఉంటుందన్నారు.

తన కొడుకు అమిత్ రెడ్డికి బీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వలేదనేది వాస్తవం కాదన్నారు. అమిత్‌ను పోటీలోకి దించాలని అధినేత కేసీఆర్ స్వయంగా కోరినట్లు చెప్పారు. లోక్ సభకు పోటీ చేసేందుకు అమిత్ కూడా సిద్ధపడ్డారని, కానీ జిల్లా నాయకుల నుంచి సహకారం అందలేదన్నారు. కొందరు నేతలు అయితే తాము పార్టీని వీడుతున్నట్లు చెప్పారని... దీంతో అమిత్ పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలిపారు.
Go Back to Shorts
Gutha Sukender Reddy
BRS
Telangana
KCR

More Telugu News