ఉండిలో రఘురామకృష్ణరాజు విజయం లాంఛనమే... ఇప్పటికే భారీ ఆధిక్యం!

  • చివరి నిమిషంలో ఉండి అసెంబ్లీ టికెట్ దక్కించుకున్న రఘురామ
  • టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన వైనం
  • 14 రౌండ్ల అనంతరం రఘురామ ఆధిక్యం 48,522
  • వెనుకంజలో వైసీపీ అభ్యర్థి పీవీఎల్ఎన్ రాజు
ఓ దశలో ఈ ఎన్నికల్లో పోటీ చేయడం ఇక దాదాపు అసాధ్యం అనుకున్న స్థితి నుంచి బయటపడి... చివరి నిమిషంలో ఉండి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ టికెట్ దక్కించుకున్న నేత రఘురామకృష్ణరాజు. వాస్తవానికి రఘురామ నరసాపురం సిట్టింగ్ ఎంపీ. వైసీపీతో విభేదాల నేపథ్యంలో, ఎన్నికలకు కొన్నిరోజుల ముందు ఆయన టీడీపీలో చేరారు.

 అయితే నరసాపురం ఎంపీ స్థానం పొత్తు ధర్మం ప్రకారం బీజేపీకి వెళ్లడంతో రఘురామ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అయితే, ఎలాగోలా సీట్ల సర్దుబాటు చేసి ఉండి టీడీపీ టికెట్ ను రఘురామకు కేటాయించారు. 

ఇవాళ కౌంటింగ్ లో రఘురామ హవా మామూలుగా లేదు. ఆయన తొలి రౌండ్ నుంచే ఆధిక్యంలో కొనసాగారు. ఇప్పటివరకు 14 రౌండ్ల పాటు ఓట్లు లెక్కించగా... రఘురామకృష్ణరాజు 48,522 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. 

ఆయనకు 14 రౌండ్ల వరకు 97,460 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి పీవీఎల్ఎన్ రాజుకు 48,938 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఉండి నియోజకవర్గంలో మరో 4 రౌండ్ల లెక్కింపు మాత్రమే మిగిలున్న దశలో రఘురామ విజయం లాంఛనమే.

Raghu Rama Krishna Raju
Undi
TDP
YSRCP

More Telugu News