ఏపీలో ముస్లిం రిజర్వేషన్లు కొనసాగుతాయి.. అనుమానం అక్కర్లేదు: కనకమేడల

  • గత ఐదేళ్లలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్న కనకమేడల
  • రాష్ట్రాన్ని పునర్నిర్మించడమే తమ తొలి ప్రాధాన్యమని స్పష్టీకరణ
  • కేంద్రం నుంచి తీసుకోవాల్సినవి చాలానే ఉన్నాయన్న టీడీపీ నేత
రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు కొనసాగుతాయని టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదని తేల్చి చెప్పారు. ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 5న ఎన్డీయే పక్షాల సమావేశం జరిగిందని, నేడు రెండో సమావేశం జరగబోతున్నట్టు చెప్పారు. ఆ తర్వాత ఎంపీలతో సమావేశం ఉంటుందని పేర్కొన్నారు.

ప్రధానమంత్రిగా మోదీ ఈ నెల 9న ప్రమాణ స్వీకారం చేస్తారని వివరించారు. అంతకంటే ముందు ఎన్డీయే నేతను ఎన్నుకుంటామని తెలిపారు. కేంద్రం ముందు మీరు ఎలాంటి డిమాండ్లు ఉంచుతారన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. దానికిప్పుడు సమయం కాదని పేర్కొన్నారు. తాము ఎన్డీయే భాగస్వాములమని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి తీసుకోవాల్సినవి చాలానే ఉన్నాయని, అదంతా పద్ధతి ప్రకారం జరుగుతుందని తెలిపారు. 

గత ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, దానిని పునర్నిర్మించేందుకు తొలి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ముస్లిం రిజర్వేషన్లను కొనసాగిస్తామని, ఈ విషయంలో ఎలాంటి సమస్యా లేదని తేల్చి చెప్పారు.

Muslim Reservations
Andhra Pradesh
Telugudesam
Kanakamedala Ravindra Kumar

More Telugu News