‘మోదీ బెదిరిపోరు’.. చైనాకు తైవాన్ కౌంటర్లు

  • ఇటీవల మూడోసారి ప్రధాని అయిన మోదీకి తైవాన్ అధ్యక్షుడి అభినందనలు
  • స్పందించి ధన్యవాదాలు చెప్పిన ప్రధాని..
  • ఆక్షేపించిన చైనా.. తాజాగా కౌంటర్లు ఇచ్చిన తైవాన్
భారత ప్రధానిగా మూడవసారి ఎన్నికైన నరేంద్ర మోదీకి తైవాన్ ప్రెసిడెంట్ లై చింగ్-తే అభినందనలు తెలియజేయడం, ధన్యవాదాలు చెబుతూ మోదీ రిప్లై ఇవ్వడాన్ని చైనా ఆక్షేపించింది. తైవాన్ అధికారుల రాజకీయ వ్యూహాలను ప్రతిఘటించాలని చైనా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే చైనా వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ తైవాన్ తాజాగా స్పందించింది. చైనాను చూసి నరేంద్ర మోదీ లేదా లై చింగ్ బెదిరిపోరని ఘాటు వ్యాఖ్యలు చేసింది. తైవాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి టిన్ చుంగ్-క్వాంగ్ ఈ మేరకు మంగళవారం స్పందించారు. మోదీ-లై చింగ్ మధ్య సంభాషణను చైనా తప్పుబట్టడాన్ని ఆయన ఖండించారు.

‘‘మూడవసారి ప్రధానిగా ఎన్నికైన మోదీకి నూతన ప్రెసిడెంట్ లై చింగ్-తే ‘ఎక్స్’ వేదికగా అభినందనలు తెలిపారు. మోదీ కూడా ఎక్స్ వేదికగానే స్పందించారని అనుకుంటున్నాను. ఒకరికొకరు అభినందనలు చెప్పుకోవడం చాలా సాధారణ విషయం. ఇతరులు దీనిపై ఎందుకు స్పందిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇద్దరి అభినందనల మధ్య కలగజేసుకోవడం అసమంజసం’’ అని టిన్ చుంగ్ కౌంటర్ ఇచ్చారు. చైనా పేరు ఎత్తకుండానే ఆయన కౌంటర్ ఇచ్చారు. మోదీ, తమ అధ్యక్షుడు ఏమాత్రం భయపడబోరని తాను చెప్పదలచుకున్నానని అన్నారు.

Narendra Modi
China
Taiwan
India

More Telugu News