భారత్-పాక్ యుద్ధంలో వీరమరణం పొందిన 'అబ్దుల్ హమీద్'పై పుస్తకం.. ఆవిష్కరించిన ఆరెస్సెస్ చీఫ్

  • దేశంలో అంతర్గతంగా ఎన్ని విభేదాలున్నా ప్రజలు కలిసే ఉంటున్నారన్న మోహన్ భగవత్
  • శత్రుదేశాలు మనపై దాడికి పాల్పడినప్పుడు ఈ విషయం వెల్లడవుతోందని వ్యాఖ్య
  • చైనా దురాక్రమణ, పాక్ దాడుల సమయంలో భిన్నత్వంలో ఏకత్వం కనిపించిందన్న ఆరెస్సెస్ చీఫ్
మన దేశంలో అంతర్గతంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ వేల ఏళ్లుగా ప్రజలంతా కలిసిమెలిసి జీవిస్తున్నారని... ఇందులో ఎలాంటి సందేహం లేదని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సర్ సంఘ్‌చాలక్ (ఆరెస్సెస్ చీఫ్) మోహన్ భగవత్ అన్నారు. 1965లో భారత్ - పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన అబ్దుల్ హమీద్ జీవితం ఆధారంగా రచించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.

ఈ పుస్తకాన్ని రామచంద్రన్ శ్రీనివాసన్ రాశారు. హమీద్ తనయుడు జైనుల్ హసన్ తండ్రితో తన అనుభవాలను రచయితతో పంచుకున్నారు. అబ్దుల్ హమీద్ బాల్యం నుంచి ఆర్మీ జీవితం వరకు వివరించారు. 

ఈ సందర్భంగా భగవత్ మాట్లాడుతూ... మనలో మనకు విభేదాలు ఉన్నప్పటికీ అందరం ఒకటే అన్నారు. శత్రుదేశాలు మనపై దాడికి పాల్పడినప్పుడు ఈ విషయం స్పష్టంగా వెల్లడవుతోందన్నారు. పాకిస్థాన్, చైనా వంటి దేశాలు భారత్‌పై దాడికి యత్నించిన సమయంలో భారతీయులు ఐక్యంగా ఉంటున్నారన్నారు.

చైనా దురాక్రమణ, పాకిస్థాన్ దాడుల సమయంలో భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తోందన్నారు. మాతృభూమిపై ప్రజలు ఎనలేని అభిమానం చూపుతున్నారన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ హమీద్‌ను కొనియాడారు. హమీద్ యూపీలోని ఘాజీపూర్ జిల్లాకు చెందిన వారు. మరణానంతరం ఆయనకు భారత ప్రభుత్వం పరమవీరచక్రను ప్రకటించింది.

RSS
Mohan Bhagwat

More Telugu News