బడ్జెట్‌లో సీతారామన్ చేసిన ఈ ప్రకటనతో మొబైల్ రీఛార్జ్‌ ధరలు మరింత పెరగడం ఖాయం!

  • టెలికం కంపెనీలు ఉపయోగించే ‘ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీస్‌’ పరికరంపై దిగుమతి సుంకం పెంపు
  • కంపెనీల 5జీ నెట్‌వర్క్ ప్రణాళికలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం
  • భారాన్ని తగ్గించుకునేందుకు మొబైల్ రీఛార్జ్ రేట్లు పెంచే అవకాశాలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2024-25ను ఇవాళ (మంగళవారం) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, లక్ష్యాలకు అనుగుణంగా కేటాయింపులు, అనేక ముఖ్యమైన ప్రకటనలను ఆమె వెల్లడించారు. అయితే నిర్మలమ్మ చేసిన ఒక ప్రకటన మొబైల్ వినియోగదారుల్లో గుబులు పుట్టిస్తోంది. దేశవ్యాప్తంగా మొబైల్ టారిఫ్‌ ధరలు మరింత పెరగవచ్చుననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. టెలికం కంపెనీలకు అవసరమైన ‘ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీస్‌ (పీసీబీఏ) అనే టెలికం పరికరం దిగుమతులపై సుంకాలు పెంచుతున్నట్టు సీతారామన్ ప్రకటించారు. ఈ నిర్ణయం నేరుగా మొబైల్ యూజర్లపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఈ నెల (జులై) ఆరంభంలోనే ప్రధానమైన మూడు టెలికం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వీ(Vi) తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచాయి. తాజాగా పీసీబీఏపై దిగుమతి సుంకాలు పెరగడంతో ఈ కంపెనీలు తమ రీఛార్జ్ ధరలను మరింత పెంచవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా పీసీబీఏ ధరల పెరుగుదల టెలికం కంపెనీల 5జీ నెట్‌వర్క్‌ల ప్రణాళికకు ఆటంకం కలిగించవచ్చునని, అందుకు కంపెనీలు టారీఫ్ రేట్ల పెంపు దిశగా అడుగులు వేయవచ్చుననే చర్చ మొదలైంది. రీఛార్జ్ ప్లాన్ల ధరల పెంపునకు దారితీయడం ఖాయమనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.

తగ్గనున్న మొబైల్ ధరలు..
మొబైల్ రీఛార్జ్ రేట్లు పెరగవచ్చుననే చర్చను పక్కనపెడితే.. మొబైల్ ఫోన్లు, మొబైల్ ఛార్జర్లపై కస్టమ్స్ సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ మేరకు బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో మొబైల్ ఫోన్లు, ఛార్జర్ల రేట్లు తగ్గనున్నాయి. మొబైల్ ఫోన్లు, ఛార్జర్లతో పాటు మొబైల్ పీసీబీఏ రేట్లు తగ్గనున్నాయి. దేశీయ మొబైల్ పరిశ్రమ వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Union Budget
Union Budget 2024-25
Nirmala Sitharaman
Mobile Recharges
Telecome Companies

More Telugu News