కేజ్రీవాల్, గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ విడుదల వెనుక బీజేపీ హస్తం: రాబర్ట్ వాద్రా

  • కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీయాలనుకుంటున్నారని ఆరోపణ
  • హర్యానా ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ధీమా
  • తన సహచరులను బీజేపీ బెదిరిస్తోందన్న రాబర్ట్ వాద్రా
ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ జైలు నుంచి బయటకు రావడం వెనుక బీజేపీ హస్తం ఉందని ఏఐసీసీ నాయకురాలు ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్ వాద్రా సంచలన ఆరోపణలు చేశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీసే లక్ష్యంతో వారిని విడుదల చేశారన్నారు.

హత్య, అత్యాచారం, అభియోగాలు మోపిన గుర్మీత్ సింగ్‌ను ఎన్నికలకు 20 రోజుల ముందు విడుదల చేశారని, అలాగే కేజ్రీవాల్ కూడా బయటకు వస్తే హర్యానాలో ప్రచారం చేస్తారని, ఇది తమకు ఉపయోగపడుతుందని బీజేపీ భావిస్తున్నట్లుగా ఉందన్నారు. కానీ బీజేపీ ఊహించినట్లుగా వారు కాంగ్రెస్ పార్టీ గెలుపును దెబ్బతీయలేరన్నారు. హర్యానా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి, భారీ మెజార్టీతో గెలిపిస్తారని వాద్రా ధీమా వ్యక్తం చేశారు.

తనకు సంబంధించిన కంపెనీ ద్వారా హర్యానాలో ఉద్యోగాలు కల్పించగలనని రాబర్ట్ వాద్రా వెల్లడించారు. హర్యానాలో తాను ఉద్యోగాలు ఇవ్వగలనని, కానీ బీజేపీ తన సహచరులను బెదిరింపులకు గురి చేయడంతో వారు దూరంగా వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పని చేయడం కష్టమని, ఆర్థికంగా తనను దెబ్బతీయాలని చూస్తున్నారని వాపోయారు.

Robert Vadra
Congress
BJP
Arvind Kejriwal

More Telugu News