ధర్మం అంటే మతం కాదు... భారతదేశ సారాన్ని సూచిస్తుంది: ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్

  • హిందూ ధర్మం కొత్తగా కనుగొనబడింది కాదన్న సర్ సంఘ్‌చాలక్
  • బంగ్లాదేశ్‌లో హిందూ మైనార్టీలపై జరుగుతున్న దాడులను ఖండించిన ఆరెస్సెస్ చీఫ్
  • ఆర్జీకర్ ఆసుపత్రి ఘటన సిగ్గుచేటు అన్న మోహన్ భగవత్
ధర్మం అంటే భారతదేశ సారాన్ని సూచిస్తుందని, మతాన్ని కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సర్‌సంఘ్‌చాలక్ (చీఫ్) మోహన్ భగవత్ అన్నారు. నాగపూర్‌లోని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విజయ దశమి వేడుకల్లో ఆయన పాల్గొని, ప్రసంగించారు. హిందూ ధర్మం అనేది కొత్తగా కనుగొనబడింది కాదని... అలాగే సృష్టించబడింది కూడా కాదన్నారు. ఇది మానవాళికి సంబంధించిన ధర్మం అన్నారు. ఇది ప్రపంచానికి ఒక మతంగా మారిందన్నారు. అలాగే భారత్‌లో మాట్లాడే ప్రతి భాషా జాతీయ భాషే అన్నారు.

సామాజిక ఐక్యత, సామరస్యం కోసం కులమతాలకు అతీతంగా వ్యక్తుల మధ్య స్నేహం ఉండాలని సూచించారు. మనం ఉన్న ప్రాంతంతో సంబంధం లేకుండా అందరూ కలిసిమెలిసి ఉంటే ఎలాంటి ఘర్షణలకు తావుండదన్నారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌లో హిందూ మైనార్టీలపై జరుగుతున్న దాడులను ఖండించారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగిన హత్యాచార ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. సమాజానికి ఇదొక సిగ్గుచేటు ఘటన అన్నారు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. బాధితురాలికి న్యాయం జరగకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ధర్మం కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారని గుర్తు చేసుకున్నారు.

Dasara
RSS
Mohan Bhagwat
Maharashtra

More Telugu News