మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల కౌంటింగ్ మొదలు.. ఆరంభ ట్రెండ్స్ ఇవే

  
యావత్ దేశం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ మొదలైంది. మరోవైపు దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల్లో 48 స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల కౌంటింగ్ కూడా కొనసాగుతోంది.

ఆరంభ ట్రెండ్స్ ఇవే..
మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి అభ్యర్థులకు ఆరంభంలో స్పష్టమైన ఆధిక్యాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 288 నియోజకవర్గాలు ఉండగా ఉదయం 8.30 గంటల సమయానికి 90 నియోజకవర్గాలకు సంబంధించి తొలి రౌండ్ ఫలితాలు వెలువడగా 68 చోట్ల ఎన్డీయే అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మహా వికాస్ అఘాడి అభ్యర్థులు కేవలం 14 నియోజకవర్గాల్లో మాత్రమే ఆధిక్యంలో కనిపించారు. మరికొన్ని చోట్ల ఇతరులు లీడ్‌లో నిలిచారు.

ఇక ఝార్ఖండ్‌లో ఎన్డీయేకి ఆధిక్యం కనిపిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 81 స్థానాలు ఉండగా ఉదయం 8.30 గంటలకు 41 స్థానాలకు సంబంధించిన ట్రెండ్స్ వెలువడగా బీజేపీ సారధ్యంలోని కూటమి అభ్యర్థులు 29 చోట్ల, జేఎంఎం నేతృత్వంలోని కూటమి అభ్యర్థులు 12 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో నిలిచారు.

కాగా తొలి అర్ధ గంటలో పోస్టల్ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు ఉంటుంది. కాబట్టి ట్రెండ్స్ మారే అవకాశాలు లేకపోలేదు. ఇటీవల హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇదే జరిగింది. ఆరంభంలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఆధిక్యం లభించడంతో గెలుపు ఖాయమని అంతా భావించారు. కానీ ఆ తర్వాత అనూహ్యంగా ట్రెండ్స్ మారిపోయి బీజేపీ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే.

Maharashtra
Maharashtra Result
Jharkhand result
Election Counting
Election Commission

More Telugu News