కేసీఆర్‌తో తెలంగాణ తల్లి విగ్రహం రూపంపై చర్చ జరగలేదు: పొన్నం ప్రభాకర్

  • ప్రభుత్వం తరఫున మర్యాదపూర్వకంగా ఆహ్వానించినట్లు వెల్లడి
  • విగ్రహావిష్కరణకు వస్తారా? లేదా? ఆయన ఇష్టమని వ్యాఖ్య
  • ఎల్లుండి సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
తెలంగాణ తల్లి విగ్రహం రూపంపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో చర్చ జరగలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రభుత్వం తరఫున ఆయనను మర్యాదపూర్వకంగా ఆహ్వానించినట్లు చెప్పారు. సచివాలయంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహవిష్కరణకు వస్తారా? లేదా? అనేది ఇక ఆయన ఇష్టమని వ్యాఖ్యానించారు. అది ఆయనే నిర్ణయించుకుంటారని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం తరఫున ఈ నెల 9న జరగనున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్‌ను ఆహ్వానించేందుకు పొన్నం ప్రభాకర్ వెళ్లారు. మాజీ ముఖ్యమంత్రిని ఎర్రవల్లిలోని ఆయన ఫాంహౌస్‌లో కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. ఇరువురు కాసేపు మాట్లాడుకున్నారు. ఆహ్వాన పత్రికను కేసీఆర్‌కు అందించిన అనంతరం పొన్నం మీడియాతో పైవిధంగా మాట్లాడారు.

కేసీఆర్‌ను కలిసిన సమయంలో ఆయన వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ సలహాదారుడు హర్కర వేణుగోపాల్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ ఉన్నారు. అంతకుముందు, రాజ్ భవన్‌లో గవర్నర్‌ను, దిల్‌కుషా అతిథి గృహంలో కిషన్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రాలను అందించారు.

KCR
Ponnam Prabhakar
Congress
Telangana

More Telugu News