ఇదేనా తెలంగాణ ఆడబిడ్డలకు సోనియా గాంధీ బర్త్ డే గిఫ్ట్?: కవిత

  • ఆడబిడ్డలను ఖాకీలతో కొట్టించారని కవిత ఆగ్రహం
  • హామీలపై ప్రశ్నించినందుకు ఆశా వర్కర్లపై అమానుషం అంటూ మండిపాటు
  • కాంగ్రెస్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడటం ఖాయమని హెచ్చరిక
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగినందుకు ఆడబిడ్డలను కాంగ్రెస్ పాలకులు ఖాకీలతో కొట్టించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఇదేనా తెలంగాణ ఆడబిడ్డలకు సోనియా గాంధీ బర్త్ డే గిఫ్ట్? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె ట్వీట్ చేశారు.

'ఆశా వర్కర్లపై అమానుషం' అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగినందుకు ఆడబిడ్డలను ఖాకీలతో కొట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని ఆరోపించారు.

నెలకు రూ.18 వేలు ఫిక్స్ డ్ వేతనం ఇవ్వాలని శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న ఆశా వర్కర్లను దారుణంగా కొడుతూ పోలీస్ వ్యాన్‌లలో ఎక్కించిన తీరు... నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్న నిర్బంధాలు, అణచివేతకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉందని పేర్కొన్నారు.

తెలంగాణ ఆడబిడ్డలకు ఇచ్చే గిఫ్ట్ ఇదేనా? ఇదేనా ప్రజాపాలన అంటే? అని ప్రశ్నల వర్షం కురిపించారు. అధికారం శాశ్వతం కాదు... చాకలి ఐలమ్మ పోరాటస్పూర్తితో, బతుకమ్మ ఆడే చేతులతోనే ఈ తెలంగాణ ఆడబిడ్డలు... కాంగ్రెస్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడటం ఖాయమని కవిత హెచ్చరించారు.

K Kavitha
BRS
Congress

More Telugu News