ఆసుపత్రి నుంచే కేసీఆర్ రాజకీయ సమీక్ష.. ప్రజా సమస్యలపై నేతలతో చర్చ

  • వైద్య పరీక్షల కోసం యశోద ఆసుపత్రిలో చేరిన కేసీఆర్
  • పరామర్శకు వచ్చిన నేతలతో ప్రజా సమస్యలపై చర్చ
  • రాష్ట్రంలో రైతుల ఇబ్బందులు, సాగునీటిపై ప్రధానంగా ఆరా
  • యూరియా కొరత, బనకచర్ల అంశంపై నేతల నుంచి ఫీడ్‌బ్యాక్
  • సమావేశంలో కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు ముఖ్య నేతలు
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రిలో చేరినప్పటికీ రాష్ట్ర రాజకీయాలు, ప్రజా సమస్యలపై దృష్టి సారించారు. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తనను పరామర్శించేందుకు వచ్చిన పార్టీ ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై ఆయన ఆసుపత్రిలోనే సుదీర్ఘంగా చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆయనను పరామర్శించేందుకు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు ఆసుపత్రికి తరలివచ్చారు. ఈ సందర్భంగా వారితో ముచ్చటించిన కేసీఆర్, రాష్ట్రంలోని రైతుల ఇబ్బందులు, వ్యవసాయ రంగంలోని సంక్షోభం, సాగునీటి సమస్యలు వంటి అంశాలపై ఆరా తీశారు.

ముఖ్యంగా, రైతులకు యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోందని, బనకచర్ల విషయంలో ప్రభుత్వ వైఖరి సరిగ్గా లేదని పలువురు నేతలు కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. నేతలు వెల్లడించిన క్షేత్రస్థాయి వివరాలను కేసీఆర్ ఓపికగా విన్నారు. ప్రస్తుత పరిణామాలపై వారి నుంచి అభిప్రాయాలు, ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు.

KCR
K Chandrashekar Rao
BRS
Telangana Politics
Farmers Issues
Yashoda Hospital
KTR

More Telugu News