అన్నపై తమ్ముడి ఘాతుకం.. ఆపకుండా వీడియోలు తీసిన స్థానికులు!

  • మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ఘటన
  • భూముల తగాదాలు, ట్రాక్టర్ అద్దె విషయంలో అన్నదమ్ముల మధ్య వివాదం
  • సీసాతో, బండరాయితో అన్నపై దాడి చేసిన తమ్ముడు
మెదక్ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో తమ్ముడు, అన్నపై గాజు సీసాతో కిరాతకంగా దాడి చేస్తుంటే స్థానికులు అడ్డుకోకుండా ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ ఘటన కొల్చారం మండలం అంసానిపల్లిలో జరిగింది.

వసురాం తండాకు చెందిన రమావత్ మంగ్త్య, రమావత్ మోహన్ అన్నదమ్ములు. భూముల విషయంలో వీరిద్దరి మధ్య తగాదాలు ఉన్నాయి. దీనితో పాటు ట్రాక్టర్ అద్దె విషయంలోనూ ఇద్దరి మధ్య వివాదం ఉంది.

ఈ క్రమంలో శుక్రవారం ఉదయం అంసానిపల్లి కల్లు దుకాణంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మత్తులో ఉన్న మోహన్ కల్లు సీసాను పగులగొట్టి మంగ్త్యను పొడిచాడు. రక్తపు మడుగులో పడి ఉన్నప్పటికీ బండరాయితో మర్మాంగాలపై దాడి చేశాడు. ఆ తర్వాత మెడకు టవల్ చుట్టి బిగించాడు. అన్నపై మోహన్ దాడి చేస్తున్న సమయంలో చుట్టుపక్కల కొంతమంది ఉన్నప్పటికీ స్పందించలేదు.

విషయం తెలుసుకున్న మంగ్త్య భార్య సంతు, కుటుంబ సభ్యులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మంగ్త్యను 108 వాహనంలో మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కొల్చారం ఎస్సై, మెదక్ రూరల్ సీఐ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మంగ్త్య భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Ramavath Mangtya
Medak district
Kolcharam
Murder
Telangana crime
Land dispute

More Telugu News