మహిళా ఎమ్మెల్యేపై ఇలాంటి వ్యాఖ్యలా... ప్రసన్నకుమార్ రెడ్డిపై ఏపీ హైకోర్టు ఆగ్రహం!

  • ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలు
  • కేసు నమోదు.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ నేత
  • తదుపరి విచారణ రేపటికి వాయిదా
ఇటీవల వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి టీడీపీ మహిళా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో, ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించింది.

ఓ మహిళా ఎమ్మెల్యేపై అలాంటి వ్యాఖ్యలు చేయడమేంటి? మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని హైకోర్టు ప్రశ్నించింది. ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై నమోదైన కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలతో "న్యూసెన్స్" సృష్టించారని హైకోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను రేపటికి (బుధవారం) వాయిదా వేసింది.

ఇటీవల నెల్లూరు జిల్లాలో ఓ కార్యక్రమంలో ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రశాంతి రెడ్డి వ్యక్తిగత, కుటుంబ అంశాలను ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే రోజు సాయంత్రం ఆయన నివాసంపై దాడి జరిగింది. 

Prasanna Kumar Reddy
Prashanthi Reddy
AP High Court
Nellore
YSRCP
TDP
Andhra Pradesh Politics
Defamatory comments
Bail Petition
Women Respect

More Telugu News