ప్రమాదకర స్థాయి దాటిన యమునా నది.. ఢిల్లీకి వరద ముప్పు

  • ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా వచ్చి చేరుతున్న వరద
  • 205.33 మీటర్ల వద్ద డేంజర్ మార్క్
  • ఆదివారం సాయంత్రానికే 204.5 మీటర్లకు చేరిన వరద
దేశ రాజధాని ఢిల్లీకి వరద ముప్పు పొంచి ఉందని, యమునా నది ప్రవాహం డేంజర్ మార్క్ కు చేరువైందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఓల్డ్ రైల్వే బ్రిడ్జి వద్ద ఆదివారం సాయంత్రం యమునా నది ప్రవాహ స్థాయులు 204.5 మీటర్లకు చేరాయని తెలిపారు. నదీ ప్రవాహం 205.33 మీటర్లకు చేరుకుంటే ముప్పు పొంచి ఉన్నట్లేనని అధికారులు తెలిపారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు హత్నికుండ్ డ్యామ్ నుంచి భారీగా నీటిని విడుదల చేస్తుండడంతో యమునా నదిలో నీటి ప్రవాహం పెరిగిందన్నారు.

ప్రస్తుత పరిస్థితిని బట్టి మంగళవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో యమునా నది నీటి ప్రవాహం డేంజర్ మార్క్ ను దాటుతుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో యమునా తీరప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

యమునా నదిలోకి హత్నికుండ్ బ్యారేజ్ నుంచి 1.27 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వజీరాబాద్ బ్యారేజీ నుంచి 46 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు చెప్పారు. ఈ రెండు బ్యారేజీల నుంచి విడుదలయ్యే నీరు ఢిల్లీ దాకా చేరుకోవడానికి సుమారు 48 నుంచి 50 గంటలు పడుతుందని అన్నారు. దీంతో ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉందని తెలిపారు.

Yamuna River
Delhi Floods
Yamuna River Delhi
Hathnikund Barrage
Delhi Rain
Old Railway Bridge
Yamuna Water Level
Delhi Flood Alert

More Telugu News