కుప్పం చేరుకున్న కృష్ణా జలాలు... నాడు చెప్పింది చేసి చూపించానన్న సీఎం చంద్రబాబు

  • శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా కుప్పం చేరుకున్న కృష్ణా జలాలు
  • నాడు చెప్పాను, నేడు చేసి చూపించానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
  • అసెంబ్లీలో చేసిన శపథం వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న సీఎం
  • పులివెందులకు కూడా నీళ్లు తెచ్చి చూపిస్తానని గతంలోనే స్పష్టం
  • కుప్పంలో కృష్ణా జలాలకు టీడీపీ శ్రేణుల ఘన స్వాగతం
  •  కొబ్బరికాయలు కొట్టి, హారతులతో కాలువ వద్ద సంబరాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా తరలించిన కృష్ణా జలాలు ఎట్టకేలకు కుప్పం గడ్డను తాకాయి. ఈ చారిత్రక ఘట్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "నాడు చెప్పాను... నేడు చేసి చూపించాను" అంటూ ఆయన హర్షం వ్యక్తం చేశారు.

గతంలో తాను అసెంబ్లీ వేదికగా చేసిన శపథాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేశారు. మదనపల్లె, పలమనేరుతో పాటు కుప్పానికి కచ్చితంగా నీళ్లు తీసుకువస్తానని, పులివెందులకు కూడా నీళ్లు ఇచ్చి చూపిస్తానని తాను అన్న మాటల పాత వీడియోను ఆయన తన పోస్టుకు జతచేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు, తమ ప్రాంతానికి కృష్ణా జలాలు చేరడంతో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, కూటమి నేతలు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. కాలువ వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని పండగ వాతావరణం సృష్టించారు. కృష్ణా జలాలకు కొబ్బరికాయలు కొట్టి, హారతులు పట్టి ఘనంగా స్వాగతం పలికారు. పార్ీ జెండాలు చేతబూని కాలువలో దిగి తమ ఆనందాన్ని నినాదాల రూపంలో వ్యక్తం చేశారు. ఈ భావోద్వేగ క్షణాలకు సంబంధించిన వీడియోలను తెలుగుదేశం పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకుంది.
Your browser does not support HTML5 video.

Chandrababu Naidu
Kuppam
Krishna River
Srisailam Reservoir
Pothireddypadu
TDP
Andhra Pradesh Irrigation
Pulivendula
Water Resources
Telugu Desam Party

More Telugu News