ఉప రాష్ట్రపతి ఓటింగ్ ఏజెంట్లుగా రామ్మోహన్ నాయుడు, కిరణ్ రిజిజు, శ్రీకాంత్ షిండే

  • రేపు భారత ఉప రాష్ట్రపతి ఎన్నికలు
  • ఎన్డీయే కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్ గెలుపు లాంఛనమే
  • ఓటింగ్ ఏజెంట్ గా టీడీపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
దేశ ఉప రాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమైంది. జగదీప్‌ ధన్‌ఖడ్‌ అనూహ్యంగా రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఈ పదవి కోసం రేపు పోలింగ్ జరగనుంది. అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌, ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి. సుదర్శన్‌ రెడ్డి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ఈ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓటింగ్ ఏజెంట్లను నియమించింది. వీరిలో తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు మరో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, ఎంపీ శ్రీకాంత్ షిండే ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పోలింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

పార్లమెంటు ఉభయ సభలకు చెందిన మొత్తం 781 మంది ఎంపీలు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో లోక్‌సభ నుంచి 542 మంది, రాజ్యసభ నుంచి 239 మంది సభ్యులు ఉన్నారు. అభ్యర్థి గెలుపొందాలంటే కనీసం 391 ఓట్లు సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుత బలాబలాలను పరిశీలిస్తే, ఎన్డీఏ కూటమికి 422 మంది సభ్యుల మద్దతు ఉంది. దీంతో వారి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

మరోవైపు, ఇండియా కూటమికి 311 మంది సభ్యుల బలం ఉండగా, మరో 45 మంది ఇతరులు ఉన్నారు. తాను ఏ పార్టీకి చెందినవాడిని కాదని, పార్టీలకు అతీతంగా విజ్ఞతతో ఓటు వేయాలని జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి ఇప్పటికే ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ జరిగి ఏమైనా సమీకరణాలు మారతాయా అని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. అయినప్పటికీ, సంఖ్యాబలం దృష్ట్యా ఎన్డీఏ అభ్యర్థికే విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. 

Ram Mohan Naidu
Vice President Election 2024
CP Radhakrishnan
Kiren Rijiju
Srikanth Shinde
Justice Sudarshan Reddy
NDA
INDIA alliance
Parliament MPs

More Telugu News