జగన్ పుట్టినరోజు.. గోదావరిలో భారీ ఫ్లెక్సీతో వినూత్నంగా వైసీపీ సంబరాలు

  • రేపు జగన్ పుట్టినరోజు
  • ఒకరోజు ముందుగానే వేడుకలను ప్రారంభించిన పార్టీ శ్రేణులు
  • రాజమండ్రిలో జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో వేడుకలు
రేపు వైసీపీ అధినేత జగన్ జన్మదినం. ఈ నేపథ్యంలో ఇప్పటికే వేడుకలను ఆ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా రాజమండ్రిలో జరిగిన సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గోదావరి నది మధ్యలో ఉన్న బ్రిడ్జి లంకలో ఏకంగా 40 వేల చదరపు అడుగుల భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి జగన్‌కు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు.

వైసీపీ కార్యకర్త కంటే వినయ్ తేజ ఈ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేయగా, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. గోదావరిలో పడవలను అందంగా అలంకరించి, పార్టీ నాయకులు, అభిమానులతో కలిసి కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు.

మరోవైపు, తాడేపల్లి సమీపంలోని కుంచనపల్లిలోనూ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి భారీ కేక్‌ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. జగన్ పాలనలో అమలైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

Jagan Mohan Reddy
YS Jagan
YSRCP
YSR Congress
Andhra Pradesh Politics
Rajahmundry
Godavari River
Birthday Celebrations
Jakkampudi Raja
Sajjala Ramakrishna Reddy

More Telugu News