టీ20 ప్రపంచకప్ చరిత్రలో టీమిండియా సరికొత్త వ‌ర‌ల్డ్‌ రికార్డు

  • టీ20 ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం
  • అమెరికాపై 29 పరుగుల తేడాతో గెలుపు
  • కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత అర్ధశతకం
  • కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న సిరాజ్, అర్ష్‌దీప్
  • వరుసగా 9 విజయాలతో ప్రపంచ రికార్డు సృష్టించిన టీమిండియా
టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు విజయంతో బోణీ కొట్టింది. నిన్న‌ జరిగిన తమ తొలి మ్యాచ్‌లో అమెరికాపై 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (84) అద్భుత అర్ధశతకంతో ఆదుకోగా, బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి జట్టుకు విజయాన్ని అందించారు. 

ఈ గెలుపుతో టీమిండియా టీ20 ప్రపంచకప్ చరిత్రలో సరికొత్త వ‌ర‌ల్డ్‌ రికార్డు సృష్టించింది. వరుసగా తొమ్మిది విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా నిలిచింది. అటు ప్ర‌పంచ క‌ప్‌ల‌లో (వ‌న్డేలు, టీ20ల్లో క‌లిపి) ఓవ‌రాల్‌గా భార‌త జ‌ట్టు 100 విజ‌యాలు పూర్తి చేసుకుంది. ఆసీస్ (108) త‌ర్వాత ఈ ఘ‌న‌త సాధించిన రెండో జ‌ట్టు కావ‌డం గ‌మ‌నార్హం. 

ఇక‌, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, అమెరికా బౌలర్ల దాటికి తడబడింది.ఒకే ఓవర్‌లో ఇషాన్ కిషన్ (20), తిలక్ వర్మ (25), శివమ్ దూబే (0) వికెట్లను కోల్పోయిన భార‌త్‌.. 13 ఓవర్లు ముగిసే స‌రికి 77 పరుగులకే 6 వికెట్లు పారేసుకుని పీక‌లోతు కష్టాల్లో పడింది. అమెరికా బౌలర్ షాడ్లీ వాన్ షాల్క్‌విక్ (4/25) టీమిండియా బ్యాటింగ్‌ను దెబ్బతీశాడు. ఈ దశలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎదురుదాడికి దిగాడు. కేవలం 49 బంతుల్లో 84 పరుగులు చేసి జట్టు స్కోరును 9 వికెట్లకు 161 పరుగులకు చేర్చాడు.

అనంతరం 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికాను భారత బౌలర్లు కట్టడి చేశారు. మిలింద్ కుమార్ (34), శుభమ్ రంజనే (37), సూరజ్ కృష్ణమూర్తి (37) పోరాడినప్పటికీ, భారత బౌలర్ల అనుభవం ముందు నిలవలేకపోయారు. అర్ష్‌దీప్ సింగ్ (2/18), మహ్మద్ సిరాజ్ (2/29), అక్షర్ పటేల్ (2/24) రాణించడంతో అమెరికా జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విజయంతో భారత్ తమ ప్రపంచకప్ ప్రస్థానాన్ని ఘనంగా ప్రారంభించింది.

T20 World Cup
Suryakumar Yadav
India vs America
Indian Cricket Team
World Record
Arshdeep Singh
Axar Patel
Mohammad Siraj
USA Cricket
Cricket World Cup

More Telugu News