సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి క్లాస్

  • అనవసర విషయాలు మాట్లాడవద్దని సూచన
  • అసెంబ్లీకి అన్ని విధాలుగా సిద్ధమై రావాలన్న సీఎం
  • ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వాలని మంత్రులకు సూచన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు. పలువురి తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. సీఎల్పీ సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీలో, బయట అనవసర విషయాలు మాట్లాడవద్దని సూచించారు. సభకు అన్ని విధాలుగా ప్రిపేర్ అయి రావాలని అన్నారు. బయట చిట్‌చాట్‌లు మానివేయాలని అన్నారు.

ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలోని సమస్యలను చెప్పుకోవడానికి మంత్రులు వారికి సమయం ఇవ్వాలని సూచించారు. ఎమ్మెల్యేలు చెప్పే సమస్యలకు స్పందించాలని అన్నారు. ఇక నుంచి తాను కూడా ఎమ్మెల్యేలకు సమయం ఇస్తానని ముఖ్యమంత్రి అన్నారు. సభలో ప్రతిపక్షాల ప్రతి అంశానికి కౌంటర్ ఇవ్వాలని సూచించారు.

ఇప్పటి సీఎల్పీ సమావేశానికి ఆరుగురు సభ్యులు రాలేదని ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. సీఎల్పీకి రాలేనంత బిజీగా ఉన్నారా అని అసహనం వ్యక్తం చేశారు. ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం మినహాయించవచ్చని పేర్కొన్నారు. అసెంబ్లీకి ప్రతి ఒక్కరు హాజరు కావాల్సిందే అని స్పష్టం చేశారు. తాము ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్ ఇన్నోవేటివ్‌గా ఉంటుందని, విద్య, వైద్యంకు ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు.

సభలో మాట్లాడే సమయంలో విప్‌ల మధ్య సమన్వయం ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. బీఆర్ఎస్ హయాంలో జానారెడ్డి, మల్లు భట్టివిక్రమార్కలకు కూడా మైక్ ఇవ్వని సందర్భాలు ఉన్నాయని, కానీ తాము ప్రతిపక్షాలకు మాట్లాడే సమయం ఇస్తున్నామని అన్నారు.

రాజకీయాల్లో మాట్లాడే మాటల వల్ల వ్యక్తిగత డ్యామేజీ ఏమో కానీ, వ్యవస్థపై ప్రభావం పడుతుందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు పార్టీ, ప్రభుత్వం లైన్‌లోనే స్పందించాలని సూచించారు. 

Revanth Reddy
Telangana CM
CLP Meeting
Telangana Politics
MLA Meeting
Assembly Sessions

More Telugu News