విరాట్, రోహిత్‌తో విభేదాలు.. మౌనం వీడిన గౌతమ్ గంభీర్

  • కోహ్లీ, రోహిత్‌తో విభేదాల వార్తలపై స్పందించిన గంభీర్
  • ఉద్దేశం సరైనదైతే తప్పుడు నిర్ణయమైనా ఆమోదయోగ్యమేనన్న హెడ్ కోచ్
  • డ్రెస్సింగ్ రూమ్‌లో అందరితో నిజాయతీగా ఉంటానని వెల్లడి
  • సోషల్ మీడియాలో వచ్చే ప్రతీదానికి వివరణ ఇవ్వలేనని స్పష్టీక‌ర‌ణ‌
సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో తనకు విభేదాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. సరైన ఉద్దేశంతో తీసుకునే తప్పుడు నిర్ణయాలను అంగీకరించవచ్చని, కానీ తప్పుడు ఉద్దేశంతో ఏదీ జరగకూడదని ఆయన స్పష్టం చేశాడు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతీ ఆరోపణకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నాడు.

'రాయ్ స్పోర్ట్స్' నిర్వహించిన 'ట్రైల్‌బ్లేజర్స్' కార్యక్రమంలో గంభీర్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా "విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లకు మీరు వ్యతిరేకం అనే ప్రచారాన్ని ఎలా ఎదుర్కొంటారు?" అని ఒకరు ప్రశ్నించారు. దీనికి గంభీర్ బదులిస్తూ.. "నేను కూడా మనిషినే. తప్పులు చేసే అవకాశం నాకు కూడా ఇవ్వాలి. గత 18 నెలల్లో నేను కూడా తప్పులు చేసి ఉండొచ్చు. దాన్ని అంగీకరించడానికి నేను వెనుకాడను" అన్నాడు.

"కానీ నేను ఒక్కటే నమ్ముతాను. సరైన ఉద్దేశంతో తీసుకున్న తప్పుడు నిర్ణయం ఆమోదయోగ్యమే. కానీ, తప్పుడు ఉద్దేశంతో తీసుకున్న తప్పుడు నిర్ణయం మా డ్రెస్సింగ్ రూమ్‌లో కుదరదు" అని గంభీర్ పేర్కొన్నాడు. డ్రెస్సింగ్ రూమ్‌లోని ప్రతి ఒక్కరితో తాను నిజాయతీగా ఉన్నంతకాలం, వారి కళ్లలోకి సూటిగా చూసి మాట్లాడగలిగినంత కాలం తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నట్లే భావిస్తానని తెలిపాడు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతిదానికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం తనకు లేదని ఆయన స్పష్టం చేశాడు.

Gautam Gambhir
Virat Kohli
Rohit Sharma
India cricket
Indian cricket team
Team India
cricket coach
cricket controversy
Trailblazers event

More Telugu News