అమెరికాతో రాజీకి నో.. ప్రతీకారానికే మొగ్గు: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్

  • అమెరికా సంధి ప్రతిపాదనలను తిరస్కరించిన ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ
  • తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని తీవ్ర హెచ్చరిక
  • శత్రువుల నుంచి పరిహారం వసూలు చేస్తామని ప్రకటన
  • ఫిబ్రవరి 28 దాడిలో మొజ్తబా తీవ్రంగా గాయపడినట్లు కథనాలు
అమెరికాతో ఉద్రిక్తతలు తగ్గించుకోవాలంటూ మధ్యవర్తి దేశాల ద్వారా వచ్చిన సంధి ప్రతిపాదనలను ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయతుల్లా మొజ్తబా ఖమేనీ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకునే విషయంలో ఆయన చాలా దృఢవైఖరితో ఉన్నారని ఓ ఇరాన్ సీనియర్ అధికారి 'రాయిటర్స్‌'కు వెల్లడించారు. తన నియామకం తర్వాత జరిగిన తొలి విదేశాంగ విధాన సమావేశంలో మొజ్తబా ఈ మేరకు స్పష్టమైన సంకేతాలిచ్చారు.

"రక్త ప్రతీకారాన్ని మేం మరిచిపోం. పూర్తి శక్తితో ప్రతిఘటిస్తాం. శత్రువుల నుంచి పరిహారం పొందుతాం లేదా అదే స్థాయిలో వారి ఆస్తులను ధ్వంసం చేస్తాం" అని మొజ్తబా ఖమేనీ హెచ్చరించినట్లు ఆ అధికారి తెలిపారు. ప్రతీకార చర్యలు ఇప్పటికే మొదలయ్యాయని, అవి పూర్తయ్యే వరకు తమ ప్రాధాన్యత అదేనని ఆయన స్పష్టం చేశారు.

ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో మొజ్తబా తండ్రి, అప్పటి సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మొజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారు. కువైట్ వార్తాపత్రిక అల్-జరీదా కథనం ప్రకారం, రష్యా అధ్యక్షుడు పుతిన్ చొరవతో మొజ్తబాను మెరుగైన చికిత్స కోసం మాస్కోకు తరలించారు. అయితే, ఈ వార్తలపై తాము స్పందించబోమని రష్యా తెలిపింది.

ఇదిలా ఉండగా, తాజా దాడిలో ఇరాన్ సీనియర్ భద్రతా అధికారి అలీ లారిజానీ, రెవల్యూషనరీ గార్డ్ బాసిజ్ ఫోర్స్ చీఫ్ జనరల్ ఘోలం రెజా సొలైమానీని చంపినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే, ఈ మరణాలను ఇరాన్ అధికారికంగా ధృవీకరించలేదు. 


Ayatollah Mojtaba Khamenei
Iran
United States
Israel
Middle East tensions
retaliation
Ali Khamenei
Gholam Reza Soleimani
Ali Larijani
Russia

More Telugu News