బీజేపీ సభలో హైడ్రామా.. నేతను చితకబాదిన మహిళ

  • యూపీ బీజేపీ కార్యాలయంలో తీవ్ర గందరగోళం
  • సన్మాన కార్యక్రమంలో నేతపై దాడి చేసిన మహిళ
  • రూ.4.5 లక్షలు మోసం చేశాడని తీవ్ర ఆరోపణలు
  • సర్దిచెప్పేందుకు యత్నించగా తోపులాట, గొడవ
ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లా బీజేపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం రసాభాసగా మారింది. ఓ పార్టీ నేత తనను లక్షలాది రూపాయలు మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ మహిళ అందరి ముందే ఆయనపై దాడికి దిగడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. జిల్లా బీజేపీ కార్యాలయంలో నూతనంగా నామినేట్ అయిన కౌన్సిలర్లు, పార్టీ పదాధికారుల కోసం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమం జరుగుతుండగా, ఓ మహిళ ఒక్కసారిగా అక్కడికి చేరుకుని, ఓ పార్టీ నేతతో ఆర్థిక విషయమై గొడవకు దిగింది. అందరూ చూస్తుండగానే ఆమె ఆ నేత చెంపపై కొట్టి, చొక్కా కాలర్ పట్టుకుని బయటకు లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతో అక్కడ ఉన్నవారు షాక్‌కు గురయ్యారు.

ఎల్ఐసీ డిపాజిట్ల పేరుతో సదరు నేత తన వద్ద నుంచి రూ. 4.5 లక్షలు తీసుకుని మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. ఆ డబ్బును తిరిగివ్వాలని చాలా కాలంగా కోరుతున్నా పట్టించుకోకపోవడంతో తన కుమారుడితో కలిసి కార్యక్రమానికి వచ్చి నిలదీసింది. అక్కడున్న కార్యకర్తలు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వాగ్వాదం పెరిగి తోపులాటకు దారితీసింది. 

విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి, గొడవను సద్దుమణిగేలా చేశారు. దాదాపు గంట తర్వాత కార్యక్రమం తిరిగి మొదలైంది. ఈ ఘటనపై పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు సమీర్ త్రిపాఠి స్పందించారు. ఇది పూర్తిగా వ్యక్తిగత ఆర్థిక లావాదేవీల వల్ల జరిగిన గొడవ అని, ఇద్దరూ పార్టీకి చెందినవారే కావడంతో త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

BJP Leader
Uttar Pradesh
Firozabad
BJP Meeting
Financial Dispute
Woman Assault
Viral Video
Police Investigation
Political News
Corruption Allegations

More Telugu News