త్వరగా నిర్ణయం తీసుకోవాలి: కవిత పార్టీపై ఈసీకి ఢిల్లీ హైకోర్టు కీలక సూచన

  • పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కవితకు చిక్కులు
  • ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కవిత
  • దరఖాస్తులో లోపాలు ఉన్నట్లు హైకోర్టుకు గతంలోనే తెలిపిన ఈసీ
  • లోపాలను సరిచేసి మళ్లీ దరఖాస్తు చేసినట్లు కవిత వెల్లడి
  • కవిత పార్టీపై త్వరగా నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు సూచనకు ఈసీ అంగీకారం
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పార్టీపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ ప్రజా జాగృతి పేరిట రాజకీయ పార్టీని తెలుగు సంవత్సరాది ఉగాది రోజున ప్రకటించాలని కవిత భావించారు. అయితే ఈ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో కవిత తన కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఈసీ వద్ద దరఖాస్తు చేసుకున్నారు.

ఈసీ నుంచి స్పందన రాకపోవడంతో ఆమె కొద్దిరోజుల క్రితం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పార్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఈసీ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కవిత పిటిషన్‌పై ఈరోజు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. 'తెలంగాణ ప్రజా జాగృతి'పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఈసీకి హైకోర్టు సూచించింది. 

కవిత దరఖాస్తులో లోపాలు ఉన్నాయని గతంలో కోర్టుకు ఎన్నికల కమిషన్ తెలిపింది. అయితే ఈ లోపాలను సరిచేసినట్లు కవిత తరఫు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. సాంకేతిక తప్పులను సరిచేసి ఈసీకి మళ్లీ దరఖాస్తు చేశామని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, కవిత పార్టీపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఇందుకు ఈసీ అంగీకరించడంతో కోర్టు విచారణను ముగించింది.

Kavitha
Kalvakuntla Kavitha
Telangana Jagruthi
Telangana Praja Jagruthi
Delhi High Court
Election Commission of India

More Telugu News