కంపెనీలేమో ఇక్కడ... సీఎస్ఆర్ నిధులు అక్కడా?: కంపెనీల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి

  • రాష్ట్రానికి మరిన్ని సీఎస్ఆర్ నిధులు రావాలన్న ముఖ్యమంత్రి
  • తెలంగాణలో కంపెనీలు ఏర్పాటు చేసి వేరే చోట ఖర్చు పెడితే ఎలా అని ప్రశ్న
  • సీఎస్ఆర్ నిధుల సమీకరణ, వినియోగం కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని సూచన
  • రాష్ట్రస్థాయిలో సీఎస్ఆర్ సెల్ ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి
ఇప్పటివరకు వచ్చిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) నిధులు ఆశించినస్థాయిలో లేవని, తెలంగాణలో కంపెనీలను ఏర్పాటు చేసి, సీఎస్ఆర్ నిధులను వేరేచోట ఖర్చు పెడితే ఎలా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి మరిన్ని నిధులు రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలోని కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు ఇచ్చే నిధులు వినియోగమయ్యేలా చూడాలని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు అధికారులతో సమావేశమయ్యారు. సీఎస్ఆర్ నిధుల సమీకరణతో పాటు, వాటిని సమర్థంగా వినియోగించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సీఎస్ఆర్ నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టే కార్పొరేట్ సంస్థలను ప్రభుత్వం తరఫున అభినందించాలని సూచించారు. రాష్ట్రస్థాయిలో సీఎస్ఆర్ సెల్ ఏర్పాటు చేయాలని అన్నారు.

రాష్ట్రంలోని కార్పొరేట్ కంపెనీలు సీఎస్ఆర్ నిధులతో చేపడుతున్న కార్యక్రమాల వివరాలు, సీఎస్ఆర్ ద్వారా చేపట్టేందుకు వీలున్న కార్యక్రమాల వివరాలను సమన్వయం చేసే బాధ్యత ఈ సెల్ నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి, కార్పొరేట్ సంస్థలకు అనుసంధానంగా ఉండేలా సీఎస్ఆర్ పోర్టల్‌ను సిద్ధం చేయాలని అన్నారు. వివిధ రాష్ట్రాల్లో సీఎస్ఆర్ నిధుల సమీకరణకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని అన్నారు.

Revanth Reddy
Telangana
CSR Funds
Corporate Social Responsibility
Telangana Development

More Telugu News