ఓట్ల గల్లంతుపై మీడియా దృష్టి పెట్టాలి: భట్టి విక్రమార్క
- అర్హులైన వారి ఓట్లు గల్లంతు కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న మల్లు భట్టి
- రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రత్యర్థులే లేరని వ్యాఖ్య
- బీజేపీ రైతు వ్యతిరేక పార్టీ అని విమర్శ
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై మీడియా ప్రత్యేక దృష్టి పెట్టాలని, అర్హులైన వారి ఓట్లు గల్లంతు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఈ ‘ఎస్ఐఆర్ మ్యాపింగ్’ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలని ఆయన కోరారు. సచివాలయంలో జరిగిన తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల అనంతరం ఆయన మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలపై ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అసలు ప్రత్యర్థులే లేరని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ తీరును తప్పుబడుతూ.. "భారతీయ జనతా పార్టీ పక్కా రైతు వ్యతిరేక పార్టీ" అని ఆయన దుయ్యబట్టారు. ప్రజల కోసం నిరంతరం పనిచేసే ప్రభుత్వాలకు, పార్టీలకు ప్రత్యేకంగా ప్రచారం అవసరం లేదని.. తాము చేసిన పనులే మాట్లాడతాయని చెప్పారు. ఇప్పటికే జరిగిన అసెంబ్లీ, లోక్సభ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తా ఏంటో నిరూపించుకుందని ఆయన గుర్తుచేశారు. ఇదే క్రమంలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం త్వరలోనే ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని భట్టి విక్రమార్క వెల్లడించారు.