సీఎం రేవంత్‌తో దక్షిణాఫ్రికా డిప్యూటీ ప్రెసిడెంట్ భేటీ

Deputy President of South Africa met CM Revanth Reddy
  • తెలంగాణలో పెట్టుబడులు, వాణిజ్యంపై ప్రధానంగా చర్చలు
  • ఐటీ, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో సహకారానికి అంగీకారం
  • పెట్టుబడులకు పూర్తి సహకారం అందిస్తామని సీఎం రేవంత్ హామీ
తెలంగాణ, దక్షిణాఫ్రికా మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా కీలక అడుగుపడింది. బుధవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో దక్షిణాఫ్రికా డిప్యూటీ ప్రెసిడెంట్ షిపోకోసా పౌలస్ మషాటిలే బృందం సమావేశమైంది. హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన ఈ భేటీలో ఇరుపక్షాల మధ్య పెట్టుబడులు, వాణిజ్య అవకాశాలపై ప్రధానంగా చర్చించారు.

సమాచార సాంకేతికత (ఐటీ), ఫార్మా, గ్రీన్ ఎనర్జీ, విద్య, నైపుణ్యాభివృద్ధి, మెడికల్ టూరిజం వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపే దక్షిణాఫ్రికా కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు పూర్తి మద్దతు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు (జీసీసీ) హైదరాబాద్‌ కేంద్రంగా మారిందని, ప్రపంచస్థాయి వైద్య సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌'కు దక్షిణాఫ్రికా ప్రతినిధి బృందాన్ని సీఎం ఆహ్వానించారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ కూడా పాల్గొన్నారు.

భారత్, దక్షిణాఫ్రికా మధ్య చారిత్రక బంధం ఉందని డిప్యూటీ ప్రెసిడెంట్ మషాటిలే గుర్తుచేశారు. ఆఫ్రికన్ కాంటినెంటల్ ఫ్రీ ట్రేడ్ ఏరియా ద్వారా తెలంగాణ కంపెనీలకు విస్తృత మార్కెట్ అవకాశాలు లభిస్తాయని, ముఖ్యంగా ఫార్మా రంగంలో స్థానికంగా ఉత్పత్తి భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు.
Go Back to Shorts
Deputy President of South Africa met CM Revanth Reddy
Telangana CM Revanth Reddy

More Telugu News