విమాన ప్రయాణికులకు ఊరట.. రూ.10,000 కోట్లతో ఇంధన నిధి!

Cabinet approves Price Stabilization Fund for Scheduled Indian Airlines towards ATF pricing
  • పశ్చిమాసియా సంక్షోభంతో పెరిగిన విమాన ఇంధన ధరలు
  • ప్రయాణికులకు పెరిగిన టికెట్ల ధరల రూపంలో భారం
  • దీంతో ‘ఇంధన ధరల స్థిరీకరణ నిధి’ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం
  • వడ్డీ లేకుండా చమురు సంస్థలకు ఆర్థిక సాయం
  • చమురు ధరలు తగ్గినప్పుడు రికవరీ
పశ్చిమాసియా సంక్షోభం కారణంగా విమాన ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ విమానయాన రంగాన్ని, ప్రయాణికులకు ఉపశమనం కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో  ‘విమాన ఇంధన ధరల స్థిరీకరణ నిధి’ ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఇందుకోసం రూ.10,000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.  

చమురు సంస్థలకు వడ్డీ లేని అడ్వాన్స్‌
అంతర్జాతీయ మార్కెట్లో విమాన ఇంధనం ధరలు పెరిగినప్పుడు ఆ భారం విమానయాన సంస్థలపై పడకుండా చమురు మార్కెటింగ్ సంస్థలకు ప్రభుత్వం ఈ నిధి నుంచి ఆర్థిక సాయం అందిస్తుంది. ఇది వడ్డీ లేని అడ్వాన్స్ రూపంలో అందుతుంది. దీనివల్ల ఇంధన ధరలు పెరిగినా చమురు సంస్థలు విమానయాన సంస్థలకు స్థిరమైన ధరలకే ఇంధనాన్ని సరఫరా చేయడానికి వీలవుతుంది.

ధరలు తగ్గినప్పుడు రికవరీ
ఈ ఇంధన నిధి కోసం ఓ ప్రత్యేకమైన రికవరీ విధానాన్ని రూపొందించారు. అంతర్జాతీయ మార్కెట్లో విమాన ఇంధన ధరలు తగ్గినప్పుడు, ఆ మొత్తాన్ని చమురు సంస్థల నుంచి ప్రభుత్వం తిరిగి వసూలు చేస్తుంది. ఆ సొమ్మును ‘కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా’కు జమ చేస్తారు. ఇలా నిధులు పూర్తిగా వసూలయ్యే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.

ప్రయాణికులకు పెద్ద ఊరట
పశ్చిమాసియా సంక్షోభం కారణంగా విమాన ఇంధనం ధర 2026 మార్చిలో లీటరు రూ.60.50 ఉండగా మే నాటికి ఏకంగా రూ.142కు పెరిగింది. విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ ఖర్చులలో ఇంధనానికే 40 నుంచి 60 శాతం వరకు ఖర్చవుతుంది. పాకిస్థాన్ గగనతలం మూతపడటంతో విమానాలు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ఈ కొత్త నిధి వల్ల ఇంధన ధరలు అదుపులో ఉండి ప్రయాణికులపై టికెట్ ధరల భారం పడకుండా ఉంటుంది.

మూడేళ్లపాటు ప్రత్యేక ఒప్పందం
ఈ పథకం కింద విమానయాన సంస్థలు, చమురు సంస్థల మధ్య ఓ అవగాహన ఒప్పందం కుదురుతుంది. దీని ప్రకారం విమానయాన సంస్థలు రాబోయే 36 నెలల పాటు కేవలం ఈ చమురు సంస్థల నుంచే ఇంధనాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల దేశంలోని టైర్-2, టైర్-3 నగరాలకు విమాన సర్వీసులు నిరంతరాయంగా కొనసాగుతాయి. అలాగే విమానయాన రంగంపై ఆధారపడిన లక్షలాది ఉద్యోగాలకు రక్షణ లభిస్తుంది.
Go Back to Shorts
ATF
Indian Airlines
Price Stabilization Fund
Fuel Price
Flight Tickets

More Telugu News